తహసీల్దార్లు మండల స్థాయిలో కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షించాలి.
ధాన్యం కొనుగోలుపై తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్.
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోఏప్రిల్30*//:రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్య కొనుగోళ్లు పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్, ధాన్య కొనుగోళ్లపై తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతులకు త్వరగా చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కొనుగోలు వివరాలను ఎప్పటి కప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేసేలా చూడాలని అన్నారు.
యాసంగి పంటకు గాను జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇప్పటివరకు 83 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, దీనికి గాను రైతులకు 85 కోట్ల 30 లక్షల రూపాయల చెల్లింపులు కూడా పూర్తి చేశామని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద మరో 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని అధికారులు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్స్ కు తరలించేలా పర్యవేక్షణ చేయాలన్నారు.
కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ కోతలు ఉండడానికి వీలులేదని, రైతులకు ఎక్కడ నష్టం రాకుండా చూసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగుల కొరత రాకుండా చూసుకోవాలని అన్నారు.
ఎఫ్ఏక్యూ ప్రమాణాలు ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని, ఖచ్చితంగా రైతులు తూర్పార పట్టి ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చే విధంగా చూడాలని అన్నారు. తహశీల్దార్లు రోజు కనీసం ఒక ధాన్య కొనుగోలు కేంద్ర సందర్శన చేయాలని, కొనుగోలు కేంద్రంలో ఎంత మేర ధాన్యం కొన్నది, ఎంత మేర మిల్లులకు తరలించింది, గన్ని బ్యాగులు ఎన్ని తీసుకున్నది, ఎన్ని గన్ని బ్యాగులు వాడింది, ఇంకా గన్ని బ్యాగులు అవసరం తదితర వివరాలన్నీ తెలుసుకొని, లోతుపాట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు ఉంటే స్థానికంగా పరిష్కరించాలని, స్థానికంగా పరిష్కారం చేయలేకపోతే వెంటనే పై అధికారుల దృష్టికి తేవాలని అన్నారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు.
ఈ సమీక్ష లో ట్రాన్స్కో ఎస్ఇ శ్రీనివాసా చారి, డిసిఓ గంగాధర్, కల్లూరు ఆర్డీవో రాజేందర్ గౌడ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, తహశీల్దార్లు, ఏపీఎం లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
