*ఖమ్మం కార్పొరేషన్, రఘునాధపాలెం మండలంలో పర్యటించి రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి తుమ్మల. *జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చి 29*//:ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ముందుగా పేదలకు చేరాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
శనివారం మంత్రి, ఖమ్మం కార్పొరేషన్, రఘునాధపాలెం మండలంలో పర్యటించి రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసారు.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ శ్రీరాం హిల్స్ లో టి.యు.ఎఫ్.ఐ.డి. సి. నిధులు కోటి రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, రఘునాథ పాలెం మండలం వి.వి. పాలెంలో వివి పాలెం ఎన్.ఎస్.పి. కెనాల్ నుండి ఇల్లందు – వైరా బైపాస్ రోడ్డు వరకు సి.ఆర్.ఆర్. నిధులు 2 కోట్ల 50 లక్షలతో చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, వివి పాలెం గ్రామం ఎస్.సి. కాలనీ నందు సి.ఆర్.ఆర్. నిధులు 60 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం ప్రజల ఆశీర్వాదంతో అవకాశం మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగు తుందని అన్నారు. అభివృద్ధి పనులలో ప్రజల సహకారం అవసరమని, ఐఏఎస్ అధికారి మున్సిపల్ కమీషనర్ గా ఉన్నారని, ఆయనతో మనం మరిన్ని కార్యక్రమాలు చేయించుకోవాలని మంత్రి తెలిపారు.
ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరా పథకానికి మరో 220 కోట్లను ప్రభుత్వం త్వరలోనే మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైయినేజి వ్యవస్థ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తూ నివేదిక పంపామని అన్నారు. ఖమ్మం నగరం చుట్టు చేపట్టిన జాతీయ రహదారులు పూర్తి చేసుకుంటే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని మంత్రి తెలిపారు.
అర్హులకు భూ పట్టాలను ఆర్డిఓతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించు కోవాలని అన్నారు. ఎన్టీఆర్ హాయంలో ఎత్తిపోతల పథకం మంజూరు చేయించామని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పనులను మండల అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మొదటి దశలో పేదలను ఎంపిక చేసి ఇండ్లు, ఇంటి పట్టాలు అందించాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, దశల వారీగా అర్హులందరికీ అందిస్తామని అన్నారు.
శ్రీరామ్ హిల్స్ లో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో ప్రధాన రోడ్ల ప్రక్కన ఫుట్ పాత్ అభివృద్ధి కోసం 10 కోట్ల నిధులు మంజూరు చేశామని, వారం రోజులలో ఈ పనులు ప్రారంభం అవుతాయని అన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్, ఇండోర్ టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ స్టేడీయం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇల్లందు క్రాస్ రోడ్డు సర్కిల్ లో నగరానికి ఆకర్షణీయంగా క్లాక్ టవర్ నిర్మాణానికి
ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు పారిశుధ్య నిర్వహణ, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
ప్రజలు కూడా సకాలంలో ఆస్తి పన్ను చెల్లించి మున్సిపల్ కార్పొరేషన్ కు సహకరించాలని, పారిశుధ్య నిర్వహణలో తమ వంతు పాత్ర పోషించాలని, తడి, పొడి చెత్త వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని కోరారు.
ఈ సందర్భంగా గ్రానైట్ సబ్సిడీ రూ. 19 కోట్ల విడుదలకు సంబంధించిప్రభుత్వ ఉత్తర్వులు మంత్రి చేతులమీదుగా గ్రానైట్ వ్యాపారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్ర, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు హరినాథ బాబు, యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




C.E.O
Cell – 9866017966
