
తెలంగాణలో అక్రమంగా ప్రవేశించిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు చేపట్టింది. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట అధికారులు భారీ స్థాయిలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మందుబాబులైతే లబ్బోదివో మొత్తుకున్నారు. అలా మందు బాటిల్స్ ధ్వంసం చేసే బదులు వారికి ఇవ్వచ్చు కదా అంటూ మొరాయించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు గత ఆరు నెలలుగా సాగిన ప్రత్యేక దాడుల్లో భాగంగా, ఢిల్లీ, గోవా, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు.
మొత్తం 103 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 6859 మద్యం బాటిళ్లు (3077 లీటర్లు) మరియు 44 బీరు బాటిళ్లు అధికారులు ఒకేచోట చేర్చారు, పంచుల సమక్షంలో రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు.ఈ మద్యం విలువ సుమారు రూ. 60 లక్షలుగా అంచనా వేయబడింది. రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, ఏఈఎస్ శ్రీనివాసరెడ్డి, సిఐ దేవేందర్ రావు మరియు సిబ్బంది ఉన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరలకు లభించే మద్యం కొనుగోళ్లు చేసి తెలంగాణకు తీసుకురావడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టూరిస్టులతో సహా ఎవరైనా సరే మద్యం తరలింపునకు పాల్పడితే కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన నిఘా ఉంటుందని, ప్రజలు చట్టాలను గౌరవించాలని డిప్యూటీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

C.E.O
Cell – 9866017966

