

చరిత్ర పరిరక్షణలో గ్రామ సర్పంచ్ కృషి భేష్.. శివనాగిరెడ్డి
ఉప్పునుంతల మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉప్పరపల్లి గ్రామంలో 800 సంవత్సరాల నాటి శిథిల శివాలయాన్ని పదిలపరిచిన గ్రామ సర్పంచ్ బొజ్జ గీతా అమరేందర్ రెడ్డిని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అభినందించారు. సీఎం ప్రవాసి ప్రజావాణి స్టేట్ కోఆర్డినేటర్, బొజ్జ అమరేందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు, శివనాగిరెడ్డి ఆదివారం (మార్చి 1) గ్రామాన్ని సందర్శించి పురావస్తు అవశేషాలను పరిశీలించారు. ఊర చెరువు ఒడ్డున గల వీరన్న గుడి, శివాలయం, అక్కడి శిల్పాలను పరిశీలించారు. శివాలయంలో చాళుక్యుల కాలపు శివలింగం, వీరన్న గుడిలో కాకతీయుల కాలపు నిలువెత్తు వీరభద్రుని విగ్రహం, మరో శివుని విగ్రహ తల భాగము, ఆలయాల ముందు గోగ్రహణ సందర్భంగా జరిగిన ఘర్షణలో మరణించిన వీరుల శిల్పాలు, కాకతీయల కాలపు నాగదేవత శిల్పాలు వెయ్యేళ్ల గ్రామ చరిత్రకు అద్దం పడుతున్నాయి. శివాలయం ముందున్న బండలపై కొత్త రాతియుగం నాటి రాతి గొడ్డళ్లు అరగదీసిన ఆనవాళ్లను గుర్తించిన శివనాగిరెడ్డి అవి 4000 సంవత్సరాల నాటివని చెప్పారు.
గ్రామ శివారులోని కస్పా బండ దగ్గర భూమిలో కూరుకుపోయిన కందూరి చోళ భీమ చోడుని శాసనాన్ని సర్పంచి గీతా రెడ్డి జెసిబి సహాయంతో బయటికి తీయగా, ఆ శాసనాన్ని చదివిన శివ నాగిరెడ్డి మామిళ్ళపల్లి నరసింహస్వామి, నైవేద్యాల కోసం గ్రామంలోని కొంత భూమిని దానం చేసిన వివరాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, పీ. వీర శేఖర చారి, గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాసచారి, వార్డు సభ్యులు దామోదర్ రెడ్డి, వెంకటయ్య, పర్వతాలు, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, జగత్ రెడ్డి, తోటపల్లి వెంకటరెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, రమేష్ గౌడ్, తోళ్ల రాజు యాదవ్, ప్రదీప్ రెడ్డి, శేఖర్ గౌడ్, కత్తులయ్య పాల్గొన్నారని సర్పంచ్ గీతా అమరేంద్ర రెడ్డి తెలిపారు.


C.E.O
Cell – 9866017966
