
హైదరాబాద్లో భారీగా బంగారు ఆభరణాలు ధరించి ప్రజల్లో తిరుగు తున్న వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించారు. ఇటీవల వరుసగా గోల్డ్ మాన్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.ఇంతకు కొండ విజయ్ కుమార్ వద్ద అధికారులు భారీ ఎత్తున బంగారం స్వాధీనం చేసుకోగా, మరో కేసులో సూర్య భాయ్ ధరించిన ఆభరణాల్లో ఎక్కువ భాగం కోటెడ్ లేదా రోల్డ్ గోల్డ్ గా తేలిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి ఐటీ అధికారుల వద్ద చిక్కాడు. నగరానికి చెందిన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
భారీగా బంగారు ఆభరణాలు ధరించి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ ఉండటంతో చిన్న పహిల్వాన్పై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. టీవీ ఇంటర్వ్యూలు, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పరిశీలించిన తర్వాత విచారణ ప్రారంభమైంది. విచారణలో అతని వద్ద 900 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు, అందులో 700 గ్రాముల బంగారు ఆభరణాలకు సరైన లెక్కలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత వినియోగానికి చెందిన 150–200 గ్రాముల బంగారాన్ని తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం–2025లోని సెక్షన్ 247 కింద జారీ చేసిన తొలి వారెంట్ ఇదే కావడంతో ఈ కేసు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
స్వాధీనం చేసుకున్న బంగారం అద్దె ఆదాయం, భూములు కొనుగోలు–అమ్మకాల ద్వారా వచ్చిందని చిన్న పహిల్వాన్ చెప్పినా, సరైన ఆధారాలు చూపలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ఐటీ రిటర్నుల్లో కూడా తక్కువ ఆదాయం మాత్రమే చూపినట్లు ఉంది. భూములను జీపీఏలపై కొనుగోలు చేసి, అధిక ధరకు మళ్లీ అమ్మి నగదు రూపంలో లాభాలు పొందినట్టు విచారణలో గుర్తించినట్లు సమాచారం.కుటుంబ సభ్యుల ఆర్థిక వ్యవహారాలపై కూడా అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఒక కుటుంబ సభ్యుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా, మరొకరు హాస్టల్ వ్యాపారం ద్వారా ఆదాయం చూపించినట్లు తెలిసింది.

C.E.O
Cell – 9866017966

