

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్(గద్దర్ అవార్డ్స్) వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ను చిరంజీవి(చిరంజీవి) అందుకున్నారు.
అవార్డు అందుకున్న అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. కళాకారులను ప్రోత్సహిస్తూ అవార్డులు ఇవ్వడం మంచి విషయమని కొనియాడారు.
అయితే చిరంజీవి తన స్పీచ్ లో ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఒక పెద్ద ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు.. అనుకున్నవన్నీ మాట్లాడలేకపోవడం లేదా అనుకోకుండా వేరేవి మాట్లాడటం సహజమే. గద్దర్ అవార్డ్స్ లో చిరంజీవి విషయంలోనూ అలాంటిది జరిగి ఉండొచ్చు. అందుకే ఎన్టీఆర్ పై తనకున్న గౌరవాన్ని తెలుపుతూ తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు.
“చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు…
తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు.
ఎన్టీఆర్ అంటే…
N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం.
తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు.
దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా…
ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ.
రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది.
అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం,
నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.” అని చిరంజీవి రాసుకొచ్చారు.
