[ad_1]
వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి కలుపుకుని తింటే ఆహా అనిపించాల్సింది… కానీ అదే పచ్చడి ఎక్కడ తయా రైందో తెలుసుకుంటే “అయ్యో!” అనిపించే పరిస్థితి. హైదరాబాద్ జియాగూడ వెంకటేష్ నగర్లో నకిలీ పచ్చళ్ల ఫ్యాక్టరీపై విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కల్తీ నిర్వాకం బయటపడింది. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా కనీస పారిశుద్ధ్య ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఈ పచ్చళ్ల ఫ్యాక్టరీ నడుస్తోందని తేలింది. జియాగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న కె. రవీందర్( అనే వ్యక్తి ఈ రుచుల రాజ్యం నడిపిస్తున్నాడు.
అయితే ఇక్కడ తయారయ్యే పచ్చళ్లలో రుచికంటే రోగాలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కుళ్లిపోయిన మామిడి, నిమ్మకాయలను రాళ్ల ఉప్పుతో నిల్వ చేసి, వాటిని పచ్చళ్లలో కలిపి మార్కెట్లోకి పంపుతున్నారు. పోలీసులు దాడి చేసి, వేల కేజీల ఎర్ర మిర్చిపచ్చడి, టమాట, ఉసిరి, నిమ్మకాయ పచ్చళ్లు సీజ్ చేశారు. వీటి విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
ఇంకా ఆసక్తికరమైన విషయం, ఈ పచ్చళ్లు ఇళ్లకే కాదు, కిరాణా షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా సరఫరా అవుతున్నాయి. అంటే మనం బయట తిన్న ప్రతి ముద్దతో రోగం కూడా శరీరంలోకి ప్రవేశిస్తున్నదన్న మాట. రవీందర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
[ad_2]