[ad_1]
దేశంలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేరళలో అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. అయినా ప్రతిపక్ష కాంగ్రెస్ లో ఎన్నికల సందడి ఇసుమంతైనా కనిపించడం లేదు. పోరాటానికి ముందే ఓటమిని అంగీకరించి హస్తం పార్టీ చేతులెత్తేసిందా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలోనే కాదు, సామాన్య జనంలో కూడా వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కాంగ్రెస్లో కనీస సందడి కూడా కనిపించకపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహారించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం జరిగింది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడి చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది. ముఖ్యంగా కీలక కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఈ పరిస్థితి క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ లో తీవ్ర నిరుత్సాహం, నిరాశ నిస్పృహలు వ్యక్తం అవుతున్నాయి.
అసోంలో అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ అధికార బీజేపీని దీటుగా ఎదుర్కొని ఎన్నికల సమరాంగణంలోకి దిగే విషయంలో కాంగ్రెస్ ఇసుమంతైనా సిద్ధం కానీ పరిస్థితి ప్రస్ఫుటంగా మారింది. రాష్ట్రంలో మిత్రపక్షాలతో పొత్తుల విషయంలో ఇప్పటి వరకూ ఏకాభిప్రాయం కుదరలేదు. అదే విధంగా పొత్తు కుదిరిన తమిళనాట కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కేవలం 35స్థానాలలో మాత్రమే పోటీ చేయడానికి అంగీకరించి పొత్తు కుదుర్చుకోవడం క్యాడర్లోనూ, స్థానిక నేతల్లోనూ ఆగ్రహానికి కారణమైంది. రాజ్యసభ స్థానాల కోసం అసెంబ్లీ స్థానాలను పార్టీ అధిష్ఠానం త్యాగం చేసిందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వెల్లువెత్తుతున్నాయి.
ఒక పశ్చిమ బెంగాల్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆ రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తు లేకుండా పోటీ చేసే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు. అయినా కూడా ఇప్పటి వరకూ వామపక్షాలతో పొత్తు విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు తమతమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో దూకుడుగా సాగుతుంటే.. కాంగ్రెస్ ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో మల్లగుల్లాలు పడుతూనే ఉంది. మొత్తానికి పశ్చిమ బెంగాల్ లో ప్రధాన పోటీ తృణమూల్, బీజేపీల మధ్యే అన్న నిర్ణయానికి కాంగ్రెస్ ఇప్పటికే వచ్చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా ఉంది, పీక సన్నం అన్న చందంగా ఉంది. రాష్ట్రంలో వంద స్థానాల్లో పక్కాగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ గంభీర ప్రకటనలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీలోని అంతర్గతాలు, నాయకుల మధ్య సమన్వయ లోపంతో విభేదాలు కేరళలో కాంగ్రెస్ ఇప్పటికీ ప్రచారాన్ని సరిగా ప్రారంభించలేదు.
ఇక పుదుచ్చేరిలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య సయోధ్య అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నారు. అక్కడ ఎన్డీయే కూటమికి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆశలను వదిలేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జాతీయ స్థాయిలో బలమైన ముద్ర వేసి అధికారపగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే చతికిల పడటం చూస్తుంటే.. ఆ పార్టీ ఇప్పట్లో పుంజుకుంటుందా? అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.
[ad_2]