[ad_1]
ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ మోషేన్ రాజు సభను గురువారానికి (5-3-26) వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పొడియం ఎక్కి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. అంతకముందు.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో మండలిలో రగడ జరిగింది. మాజీ సీఎం జగన్ను క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
ఈ సభను ఒకసారి వాయిదా వేశారు చైర్మన్. తిరిగి మొదలైన తర్వాత కూడా.. జగన్కు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 'జగన్ను నేను క్రిస్టియన్ అని అన్నాను, ఆ మాటకు కట్టుబడి ఉన్నాను' అని స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కాదని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు. 'జగన్ కూడా టీవీలో చూసి ఉంటారు కదా... కాదని చెప్పమనండి' అని మంత్రి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కుటుంబంతో తిరుమల దర్శనానికి ఎందుకు రాలేదని నిలదీశారు. వైసీపీ సభ్యులు సిగ్గు లేకుండా మాట్లాడారు మంత్రి అచ్చెన్నాయుడు. దీంతో వైసీపీ సభ్యులు పొడియం వద్దకు వచ్చి జగన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రసంగించారు. వైసీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రూ.320లకు కిలో ఆవు నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా?' అని ప్రశ్నించారు. వీళ్లు హిందువులు ఎలా అవుతారంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. రూ.320లకు ఆవు నెయ్యి కొనాలని అడుగుతున్న వైసీపీ సభ్యులు.. ఎమ్మెల్సీలు ఎలా అయ్యారని నిలదీశారు. సోమువీర్రాజు మాట్లాడుతున్న సమయంలో పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ సభను గురువారానికి(మార్చి 5) వాయిదా వేశారు.
[ad_2]