*రైతులు ఆయిల్ పామ్ వంటి లాభసాటి పంటలను సాగు చేయాలి
*ఈదురు గాలులు, అకాల వర్షాలతో దెబ్బతిన్న బొప్పాయి తోటలను పరిశీలించిన మంత్రి తుమ్మల
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే 02*//:ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలము పంట మార్పిడి విధానంతో అకాల వర్షాల నష్టాలను తగ్గించవచ్చని, అకాల వర్షాల వల్ల దెబ్బతినని ఆయిల్ పామ్ వంటి లాభాసాటి పంటను రైతులు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రఘునాధపాలెం మండలం సూర్య తండాలో గురువారం నాటి అకాల వర్షం, తీవ్రమైన గాలులకు దెబ్బతిన్న బొప్పాయి తోటలను, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 25 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని, గత రెండు, మూడు రోజులుగా కురిసిన రాళ్ల వాన, అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలపై కలెక్టర్లు నివేదికలు పంపారని మంత్రి తెలిపారు.
అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు తాత్కాలిక సహాయం అందిస్తూ, ఏప్రిల్, మే నెలలో వచ్చే రాళ్ళ వానలకు పంట నష్టపోకుండా ఉండాలంటే ఆ కాలంలో తగిన పంటలు సాగు చేయాలని మంత్రి తెలిపారు. బొప్పాయి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు నష్టపోతున్నాయని, ప్రభుత్వం అందించే పరిహారం సరిపోవడం లేదని, రైతు నష్టపోకుండా ఉండాలంటే పంట కాలం, పంటలు మార్చుకోవాలని మంత్రి సూచించారు.
ఆయిల్ పామ్ వేసిన రైతులు అకాల వర్షాలతో నష్టపోవడం లేదని, రైతులందరూ ఆలోచన చేసి లాభసాటి పంటలు సాగు చేయాలని అన్నారు. పంట మార్పిడి విధానం తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. నష్టం జరిగిన రైతులకు తాత్కాలికంగా ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని, భవిష్యత్తులో ఇటువంటి నష్టాలు జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి ఎం.వి. మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




C.E.O
Cell – 9866017966
