*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోసత్తుపల్లి, మార్చి13*//:యాతాలకుంట టన్నెల్ పనులు వేగంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
గురువారం మంత్రి, సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సత్తుపల్లిలోని యాతాలకుంట టన్నెల్ పనులను, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ లతో కలిసి ట్రాక్టర్ స్వయంగా నడుపుకుంటూ పరిశీలించారు.
ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* ఉమ్మడి రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గానికి మంచి పేరు ఉందని అన్నారు. మన ఖమ్మం జిల్లా తలాపున పారుతున్న గోదావరి నదిని వినియోగించుకోవడం వల్ల మన ప్రాంతానికి కరువు శాశ్వతంగా దూరమవుతుందని అన్నారు.
గతంలో దుమ్ముగూడెం మొదలు పెట్టినా, వైయస్సార్ హయాంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రతిపాదన తెచ్చిన, శ్రీరాముని దయతో నేడు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుపుకుంటున్న గోదావరి నీటి కోసమేనని, ఈ ప్రాజెక్టులో పాలుపంచుకునే అవకాశం లభించిందని అన్నారు.
గిరిజన ప్రాంతాలకు పూర్తిస్థాయిలో రోడ్డు సౌకర్యం కల్పించామని అన్నారు. రైతులు లాభసాటి పంట పండించుకునే దిశగా అవసరమైన సాగు నీరు అందించే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు తమ సమస్యల్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకుని రావాలని, పేపర్ లోలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు స్పందించాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు.
ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. రైతు రుణమాఫీ క్రింద ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు చేసిందని, రైతు భరోసా నిధులను మార్చి చివరి నాటికి ఎకరానికి 6000 రూపాయల విడుదల చేస్తామని అన్నారు. పెండింగ్ సన్న రకం ధాన్యం బోనస్ డబ్బు త్వరలో జమ చేస్తామని అన్నారు.
జిల్లాలో జాతీయ రహదారి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని, విజయవాడ జగదల్పూర్ రహదారి పూర్తి చేశామని, కొత్తగూడెం నుంచి హైదరాబాద్ రహదారి పనులు జరుగుతున్నాయని, సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు పనులు పూర్తి చేశామని, ఖమ్మం నుంచి దేవరపల్లి రాజమండ్రి పనులు ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని అన్నారు.
ప్రస్తుతం తన ప్రథమ కర్తవ్యం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడమేనని మంత్రి అన్నారు. కొత్తగూడెంలోని జూలురుపాడు టన్నెల్, భూ సేకరణ పూర్తి చేసుకుంటే పాలేరుకు నీళ్ళు చేరుతాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి యాతాలకుంట టన్నెల్ పూర్తయితే లంక సాగర్ కు నీళ్లు వెళ్తాయని, సత్తుపల్లి మండలం, వేంసూరు మండలం , అశ్వరావు పేట వైపు మొత్తం మూడు లక్షల ఎకరాల వరకు ఆయకట్టు లభిస్తుందని అన్నారు.
యాతాలకుంట పనులు వేగవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. సంవత్సరం కాలంలో యాతాలకుంట టన్నెల్, సత్తుపల్లి ట్రంక్ పూర్తి చేసి అదనపు ఆయకట్టు సాగు అవుతుందని అన్నారు. గోదావరి జలాలు వస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు.
భవిష్యత్తులో నీటికి కొరత ఉండని కారణంగా రైతులంతా హార్టికల్చర్ వైపు మారాలని, భవిష్యత్తులో వ్యవసాయానికి మంచి డిమాండ్ ఉంటుందని అన్నారు. రైతులు లాభసాటి పంటలు పండించాలని మంత్రి తెలిపారు. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ* రాజీవ్ లింక్ కెనాల్ పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించామని, అదే సమయంలో కెనాల్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందజేశామని అన్నారు. మిర్చి పంట ధర లేని కారణంగా రైతులు నష్టపోతుంటే మార్కెట్లో వ్యాపారులతో చర్చించి ధరను 500 రూపాయల వరకు పెంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఎక్కడ పంట ఎండిపోయే పరిస్థితిలో లేదని అన్నారు. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ భూసేకరణ కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
రైతు అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల బలంగా విశ్వసిస్తారని కలెక్టర్ తెలిపారు. రైతు వేదికల ద్వారా ఆధునిక సాగు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమంలో నిర్వహించాలని అన్నారు. గత ఆరు నెలల కాలంలో ఖమ్మం జిల్లాలో కొత్తగా 5700 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు ప్రారంభించామని అన్నారు.
కార్యక్రమంలో *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ గోదావరి నదిపై భారీ లిఫ్ట్, కెనాల్, టన్నెల్స్ నిర్మించి కష్టపడి రైతులకు సాగునీరు ప్రభుత్వం తీసుకొని వస్తుందని, ఈ నీటిని సంప్రదాయ పంటలకు కాకుండా ఆయిల్ పామ్, కూరగాయలు, పండ్లు వంటి లాభసాటి పంటల సాగుకు ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఆయిల్ పామ్ పంటకు భారీగా సబ్సిడీ వస్తుందని అన్నారు. అశ్వారావుపేట దగ్గర ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందని, రైతులు రాజులాగా బ్రతుకువచ్చని అన్నారు. గతంలో ప్రజలు రైస్ తక్కువ తినేవారు కాబట్టి ఆరోగ్యంతో జీవించారని అన్నారు. రైతులు చిన్న అడుగు ముందు వేస్తే చాలా లాభాలు వస్తాయని అన్నారుఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఇర్రిగేషన్ సిఇ శ్రీనివాస రెడ్డి, జెడ్పి సిఇఓ దిక్షా రైనా, ట్రాన్స్కో ఎస్ఇ శ్రీనివాస చారి, ఎస్డీసి రాజేశ్వరి, కల్లూరు ఆర్డీవో రాజేందర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.





C.E.O
Cell – 9866017966
